ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అధికారికంగా ఈ సాయంత్రం 6 గంటలకే పూర్తి అయిపోయింది. అయితే నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్ జరుగుతోంది. లైన్ లో ఉన్న చివరి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే వరకూ పోలింగ్ స్టేషన్లు పని చెయ్యబోతున్నాయి. పోలింగ్ పూర్తి అయ్యాక ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. మే 23న ఫలితాలు వెల్లడి అవుతాయి.
నెలన్నర సమయం ఉండటంలో ఇప్పటివరకూ కష్టపడిన నేతలు కొంత సేదతీరబోతున్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన జగన్ తనకు వేరే రాష్ట్రాలలో ప్రచారం చేసే ఐడియా ఏమీ లేదని హాలిడే తీసుకుంటా అని చెప్పారు. చంద్రబాబు నాయుడు మాత్రం వేరే రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కుటుంబంతో పాటు హాలిడే కి వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో కొంత రెస్టు అవసరమని డాక్టర్ల సలహా.
ఎన్నికల ఫలితాలు సరిగ్గా రాకపోతే మాత్రం ఆయన మీద మళ్ళీ సినిమాలకు తిరిగి రావాలనే ఒత్తిడి కూడా ఉండబోతుంది. వచ్చే ఐదేళ్ళ పాటు పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరుబట్టి జనసేన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి నాయకులకు ఈ బ్రేక్ అవసరమైనదే. మే 23న ప్రజలు ఒక అనుభవం ఉన్న నాయకుడికి రెండో అవకాశం ఇస్తారా లేదా పూర్తిగా అనుభవం లేని నాయకుడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని మార్పు కోరుకుంటారా అనేది తెలుస్తుంది.