కీలకమైన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ వంటి బయటి వాళ్ళతో రాజకీయం నడిపి దెబ్బతిన్నారు. బీజేపీ కూడా అదేబాటలో పయనిస్తోంది. అవ్వడానికి తెలుగు వారే అయినా రాంమాధవ్, జీవీఎల్ నరసింహారావు వంటి ప్రజాజీవితంతో సంబంధం లేని వారితో రాజకీయం చేస్తుంది.
వీళ్ళు ఎన్నడైనా పంచాయతీ వార్డు మెంబర్గా అయినా గెలవకపోవడంతో ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా కేంద్రం చేసిన అన్యాయాన్ని సమర్ధిస్తూ తమకు తెలీకుండానే పార్టీకి చెడే చేస్తున్నారు. ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో వట్టి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేసాం కదా అని ఇక్కడా అలాగే వచ్చేస్తాం అనుకుంటూ ప్రజలను మభ్యపెట్టే పని చేస్తున్నారు.
ఈరోజు కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెద్ద అవసరంగా కనపడటంలేదు. ఒకవేళ 2019లో సొంతంగా మెజారిటీ రాని పక్షంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న తప్పులు అప్పుడు బీజేపీని వెంటాడవచ్చు. ఇప్పటికైనా కమలనాధులు తెలుసుకుంటారో లేదో మరి.