ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరిగిపోతోంది. కలవరపరిచే విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వెలుగు చూస్తున్న కేసుల సంఖ్య దడపుట్టిస్తోంది. రోజుకు నాలుగు వందలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేరే దేశాల నుండి, వేరే రాష్ట్రాల నుండీ వచ్చిన వారే కాకుండా స్థానిక కేసులు కూడా పెరగడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో లాక్ డౌన్ అమలు చెయ్యనున్నారని సమాచారం. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆదివారం మాంసం దుకాణాలు బంద్ చేయిస్తారు అలాగే రెస్టారెంట్లలో డోర్ డెలివరికి మాత్రమే అనుమతినిస్తారని అంటున్నారు.
మరోవైపు… ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు యథావిధిగా తమ పనులకు వెళ్ళవచ్చు. అయితే ఐడీ కార్డులు తప్పనిసరి. ప్రత్యేకంగా అనుమతులు ఉన్న వాటికి తప్ప ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్లు ఇతరత్రా ప్రైవేట్ రవాణా వాహనాలకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతి ఎక్కువగా ఉంది. గడచిన ఇరవై నాలుగు గంటలలో 14,516 నమోదయ్యి మొత్తం కేసులు 3,95,048కు చేరుకున్నాయి. అలాగే 375 కొత్త మరణాలతో మొత్తం మరణాలు 12,948కు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా దాదాపుగా 100 మంది బలయ్యారు.