యాదాద్రి నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్; టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు; ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం, కేసీఆర్ కిట్ వంటి వాటిని చెక్కి విమర్శలకు తావిచ్చారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో దేవాలయం వారు ఇస్తున్న వివరణలు మరింత హాస్యాస్పదంగానూ, వివాదాస్పదంగానూ ఉన్నాయి.
కేసీఆర్ బొమ్మ చెక్కాలని ఎవరూ తమకు చెప్పలేదని ఆలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు చెప్పారు.కేవలం పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి బొమ్మను శిల్పులు చెక్కారని, అది అభ్యంతరం అయితే దానిని తొలగించే యత్నం చేస్తామని ఆయన అన్నారు. అహోబిలంలో గాంధీజీ,ఇందిరగాందీల బొమ్మలు ఉన్నాయని కిషన్ రావు తెలిపారు.ఆలయ స్తంభాలపై కారు బొమ్మే కాకుండా,సైకిల్,ఎడ్లబండి తదితర బొమ్మలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.
అంతటితో ఆగకుండా రాజకీయ నేతల విమర్శలుతమను బాధించాయిని ఆయన పేర్కొన్నారు. కాగా కేసీఆర్ ను శిల్పి దేవుడిగా ఊహించుకున్నందునే ఆయన బొమ్మ చెక్కారని ఆర్కిటెక్ట్ ఆనందసాయి వివరించారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకూ దీని మీద ప్రభుత్వం నుండి ఎటువంటి వివరణ రాలేదు. మరోవైపు బీజేపీ ఈ వివాదాన్ని అవకాశం మలుచుకుని రాజకీయంగా బలపడాలని చూస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.