ప్రిన్స్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి అమృతరావ్, ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. మరోవైపు బాలీవుడ్లోనూ కొన్ని సినిమాల్లోనే కనిపించిన అమృతా, ఆశించిన తారాస్థాయిలో మెరవలేకపోయింది. సినీ అవకాశాలు లేక ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తోన్న అమృతా, తనకున్న సింగింగ్ టాలెంట్ కూడా ఉపయోగించుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి క్లుప్తంగా విశ్లేషించింది ఈ ముద్దుగుమ్మ.
తాను సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా, నటించిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చిందని, తన నిబంధనల మేరకే అగ్ర దర్శకుల చిత్రాలలోనూ నటించినట్లు పేర్కొంది. పై స్థాయికి వెళ్లాలని ఎవరితోనూ పోటీ పడలేదని, ఈ అంశంలో తాను సంతోషంగా వున్నానని, అయినా తనను ప్రోత్సహించేందుకు బాలీవుడ్లో ఎవరూ లేరని, తనకు అవకాశాలు కల్పించడానికి గాడ్ఫాదర్ గానీ, సూపర్స్టార్ బాయ్ ఫ్రెండ్స్ గానీ ఎవరూ లేరంటూ చమత్కరించింది. అయినప్పటికీ కొన్ని సినిమాలు చేసినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని వెల్లడించింది.
2010లో తన ముందుకు మంచి అవకాశం వచ్చిందని, ఆ సమయంలో మూడు భారీ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్, టబు వంటి తారలతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందినట్లు తెలిపిన అమృతా, సినిమాల్లో తాను పాడిన పాటలకు తనకు డబ్బులు కూడా వచ్చాయని తెలిపింది. కానీ అదృష్టం బాగోలేక ఆయా చిత్రాలు సెట్స్ పైకి వెళ్లలేదని, అదే తన కెరీర్కు మైనస్ పాయింట్గా మారిందని చెప్తూ తన మనసులోని భావాలను వ్యక్తపరిచింది.