రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందుగా జులై 30, 2020 న విడుదల అవుతుందని చెప్పినా, ఇప్పుడు దసరాకు వాయిదా పడుతుందని అంటున్నారు. కొందరైతే ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుందని కూడా అంటున్నారు.
ఇప్పటివరకూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. మహేశ్ బాబు, అమితాబ్ బచ్చన్ ఆర్ ఆర్ ఆర్ బృందంలో చేరుతున్నారట. కాకపోతే వాళ్లు కనిపించరు.. వినిపిస్తారంతే.
టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వెర్షన్ కు మహేశ్ , హిందీ వెర్షన్ కు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి.. అమితాబ్, మహేశ్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట.
దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ నటులు… అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజయ్ దేవగన్ షూటింగ్ మొదలు పెట్టగా.. అలియా ఇంకా షూటింగ్ లోకి ఎంటర్ కావాల్సి ఉంది.