బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కొన్ని తెలుగు చిత్రాలలో మాత్రమే నటించారు, కానీ ఆయనకి టాలీవుడ్ తో దీర్ఘకాల సంబంధం ఉంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఆకలితో ఉన్న పరిశ్రమకు చెందిన ఫిల్మ్ వర్కర్స్ మరియు రోజు కూలీలకు సహాయం చేయడానికి బిగ్ బి ముందుకు వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని డైలీ వేజ్ ఫిల్మ్ వర్కర్లకు పంపిణీ చేయడానికి బిగ్ బి 12,000 కరోనా రిలీఫ్ కూపన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కూపన్ విలువ రూ .1500. ఈ కూపన్లను అన్ని బిగ్ బజార్ స్టోర్లలో రీడీమ్ చేయవచ్చు. కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి నాయకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కోసం ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఈ సమయంలో మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని పేదల సంక్షేమార్థం ముందు ముందు కూడా ఈ ఛారిటీని కొనసాగిస్తామని చిరంజీవి, ఇతర సినీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరచునే అవకాశం కనిపించడం లేదు. అదే విధంగా షూటింగులు మొదలు అవ్వవని అంటున్నారు. ఇది పరిశ్రమకు, దాని మీద ఆధారపడ్డ వారికీ పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. కొందరైతే జూన్ జులై నాటికి కానీ ఈ పరిస్థితి చక్కబడదని అంటున్నారు.