‘ధూమ్ 3’ సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ప్రస్తుతం ‘థగ్’ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో కలిసి తొలిసారిగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అమీర్ ఖాన్ నటించనున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇంత కాలం మౌనం వహించిన అమీర్ ఖాన్ తొలిసారిగా స్పందించాడు.
“తాను అమితంగా ఆరాధించి, గౌరవించే వారిలో సూపర్ స్టార్ అమితాబ్ ఒకరని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తాను అమితాబ్ కు పెద్ద అభిమానినని చెప్పాడు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని, అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తన కల నిజమైనట్టేనని చెప్పాడు. ఆయనతో కలిసి నటించడమనే తన కల నెరవేరుతుందని తాను భావిస్తున్నానని, ఎప్పుడనేది త్వరలోనే మీకు తెలుస్తుందని” చెప్పిన అమీర్ ఖాన్…తామిద్దరం కలసి నటిస్తున్నామని చెప్పకనే చెప్పాడు.