తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో అప్పటికప్పుడు ఆయన దిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రభుత్వంపై దాదాపుగా 50000 కార్మికులు పోరాడుతున్నారు.
అయితే బీజేపీ ఈ విషయాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేకపోయిందని అమిత్ షా అభిప్రాయమాట. అందుకే ఆయన ఉన్నఫలంగా లక్ష్మణ్ ను ఢిల్లీకి పిలిచారని సమాచారం. మరోవైపు ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల తీరుపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఒక ఎంపీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించినా కనీసం మీడియాలో కూడా ప్రముఖంగా రాలేదని, ఇది పూర్తి స్థాయిలో పార్టీ ఫెయిల్యూర్ అని అధిష్టానం భావిస్తుంది.
మరోవైపు లక్ష్మణ్ దిల్లీ వెళ్లే ముందు తెజస అధ్యక్షుడు కోదండరాం, ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తమ సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకునివచ్చి పరిష్కరించాల్సిందిగా అశ్వత్థామరెడ్డి లక్ష్మణ్ ను కొరారట. మరోవైపు ఆర్టీసీ సమస్య కీలకాంశం గా తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగబోతుంది. ప్రజా రవాణాలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అదే జరిగితే సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. అయితే హుజుర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి రికార్డు మెజార్టీతో గెలవడం, ఆ ఎన్నికలో సమ్మె ప్రభవం ఏ మాత్రం కనిపించకపోవడంతో ప్రజా మద్దతు తమకే ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దీనితో కఠిన చర్యలకు ఉపక్రమించింది. సంస్థ మనుగడనే ప్రశ్నర్ధకం చేసే ప్రైవేటు భాగస్వామ్యం కోసం రూటు క్లియర్ చేస్తుంది.