ఒక్క రోజు హైదరాబాద్ యాత్రలో భాగంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు అమిత్ షా క్లాస్ పీకినట్టు సమాచారం. జనచైతన్య యాత్రతో పార్టీ బలపడిందనుకోవద్దని, గతంలో కంటే కొంత మెరుగుపడింది అంతేనన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ వేగం చాలదని, మరింత దూకుడుగా ముందుకెళ్లాలని చెప్పారు.
పార్టీపరంగా ప్రజలను నేరుగా కలిసే కార్యక్రమాలు లేవని, పార్టీ కార్యాచరణ అమలు కావడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పథకాలతో తెరాస ఓట్ల రాజకీయం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైకోర్టు విభజన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే కొంత అనుకూలత సాధిస్తామని ఆయన చెప్పగా ఇవి కేంద్రం పరిశీలనలో ఉన్నాయని అమిత్షా దాటవేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 4వేలు ఇస్తుంటే కేంద్రం మద్దతు ధర పెంచడం ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు 12 వేల వరకు లబ్ధి జరుగుతుంది. ఇలాంటి అంశాల్ని, తెరాస వైఫల్యాలను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లండని అమిత్ షా వారికి చెప్పుకొచ్చారు. నాయకులంతా పార్టీ కార్యాలయం వదిలి గ్రామాల్లోకి వెళ్లండని చెప్పారని సమాచారం.