జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కలిపించే ఆర్టికల్ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకున్నారు. కాసేపటి క్రితం లోక్ సభలో కూడా ప్రవేశపెట్టారు. ఆమోదం లాంఛనమే. జమ్ము, కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా.. లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.
మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను దేశం మొత్తం హర్షిస్తుంది. అయితే బిల్లును ఆమోదింప చేసుకున్న తీరును తెలంగాణ బిల్లును గుర్తు చేస్తుంది. నాడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసేసి, లోక్ సభ లైవ్ ఆపేసి, ఆంధ్రకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లును ఆమోదించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కాశ్మీర్ కు చెందిన వారిని హౌస్ అరెస్టు చేసి అక్కడ కనీసం ఫోన్లు, ఇంటర్నెట్లు పని చెయ్యనివ్వకుండా చేసి తమకు కావాల్సిన విధంగా జరిపించుకున్నారు.
చేసింది మంచా చెడా అనేది పక్కన పెడితే… అధికారంలో ఉన్న ప్రభుత్వం తమకు పార్లమెంట్ లో ఉన్న మెజారిటీ తో ఏ రకమైన చట్టాలు కావాలంటే ఆ రకమైన చట్టాలు ఎవరితోనూ సంప్రదించుకుండా చేసేసుకోవచ్చు అనే చెడ్డ సంస్కృతి అటు కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేసి చూపెట్టాయి. మేము మంచి కోసం ఉపయోగించాం అని బీజేపీ ఇప్పుడు చెప్పుకున్నా రేపు ఇంకొక ప్రభుత్వం ఇదే తీరును అనుకరించి ఒక రాష్ట్రానికో లేక దేశానికో అన్యాయం చెయ్యవచ్చు కదా?