ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో ఒక్కో రోజు అలస్యమయ్యే కొద్దీ శత్రువులు పెరుగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో సమావేశమైన అనంతరం వ్యాఖ్యానించిన అమిత్ షా… ఇటీవల తిరుపతి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆలస్యం చేస్తే మిత్రులుగా ఉన్నవారు రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో శత్రువులుగా మారతారని, దాని వల్ల వ్యతిరేకులను పెంచుకోవడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని, పవన్ వంటి బీజేపీ మిత్రులను దూరం చేసుకునే పరిస్థితిని తీసుకురానివ్వబోమని” అన్న తరువాతనే రాష్ట్రానికి హోదా, ప్యాకేజీలపై ముసాయిదా తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని వరాలను ప్రకటిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సమస్యలు వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఏపీ పరిస్థితిని వివరిస్తూ, వారికి సర్దిచెప్పే మార్గాలను అన్వేషించాలని జైట్లీ, వెంకయ్య నాయుడులకు అమిత్ షా సూచించినట్లుగా తెలిసింది. ముఖ్యంగా విభజన నేపధ్యంలో ఏపీలో ఏర్పడిన కఠోరమైన పరిస్థితులను వివరిస్తూ, ఇతర రాష్ట్రాల డిమాండ్ లను పక్కన పెట్టాలని పలు సూచనలు చేసినట్లుగా సమాచారం. కాగా, కేంద్ర మంత్రి సుజనా తయారు చేసిన ముసాయిదాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తరువాత తుది రూపు ఇచ్చి బహిర్గతపరచాలని కేంద్రం భావిస్తోంది.