అమరావతి కలను కాలగర్భంలో కలిపెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం కృతనిశ్చయంతో ఉంది. మండలిలో బిల్లుని ఆపి టీడీపీ తాత్కాలికంగా బ్రేక్ వేసినా అది తాత్కాలికమే, మూడు నాలుగు నెలల తరువాతైనా మూడు రాజధానులు జరిగి తీరుతాయని అధికారపక్ష నేతలు చెబుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో అమరావతికి ఒక స్మార్టు సిటీ అవార్డు రావడం విశేషం.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్మార్ట్ సిటీల మూడవ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ‘ప్రజల కోసం నగరాల నిర్మాణం’ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు జరుగనుంది. ఈ సదస్సు సందర్భంగా అత్యుత్త ప్రదర్శన కనబరుస్తున్న నగరాలకు అవార్డులు అందించారు.
రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫామెన్స్ అనే అంశంలో అమరావతికి, ముడసర్లోవలో ప్లోటింగ్ సోలార్ ఏర్పాటుపై విశాఖకు అవార్డులు దక్కాయి. ఇక అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్ ‘సిటీ’ అవార్డు దక్కించుకుంది. మనుగడే అనుమానంగా మారిన తరుణంలో అమరావతికి స్మార్టు సిటీ అవార్డు రావడం ట్రాజెడీ అనే చెప్పుకోవాలి.
ఇది ఇలా ఉండగా రాజధాని తరలింపుని తాత్కాలికంగానైనా ఆపిన మండలిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కినుక వహించినట్టుగా కనిపిస్తుంది. మండలి రద్దు ఖాయమని ఇప్పటికే అధికార పక్షం ఇండికేషన్స్ ఇచ్చింది. సోమవారం దీనికి సంబంధించిన రిజల్యూషన్ ను సభలో పెట్టి పాస్ చేసే అవకాశం ఉందంటున్నారు.