రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతిలో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరింది. హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చే సమయం దగ్గర పడుతుండడంతో రైతులు తమ ఆందోళనను ఉదృతం చేశారు. ఇప్పుడు అమరావతి సెగ హీరో మహేష్ బాబుకు కూడా తగలడం విశేషం. శుక్రవారం నాడు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఏపీ రాజధాని కోసం నిరాహార దీక్ష చేపట్టారు.
నగరంలోని ఫిలింనగర్లో జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సినిమాల మీద వచ్చే ఆదాయంతో స్టార్లుగా వెలుగుతున్న హీరోలు ఈ విషయంగా స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా రేపు విడుదల కానుండడంతో ఈ నిరసన ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అక్కడకు చేరుకొని నిరసన తెలియజేస్తున్న వారిని అక్కడ నుండి తరలించే అవకాశం ఉంది.
మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున రెండో సారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు తండ్రైన సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటినుండో వైఎస్ కుటుంబానికి మద్దతుదారు. ఈ విషయంగా కృష్ణ ఫ్యామిలీ స్పందించే అవకాశం తక్కువే.