amaravati-chandrababu-officeనవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి నుండే పాలన సాగించాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళ నుండి గట్టి పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగానే పాలన సాగించనున్నారు. అయితే, ఈ సిఎం కార్యాలయాన్ని అత్యంత పటిష్టంగా, పూర్తి రక్షణాత్మకంగా రూపొందించారు.

అమరావతిలో మొత్తం ఆరు భవనాలుగా నిర్మిస్తున్న సచివాలయంలో ఇప్పటికే నాలుగు భవనాలు సిద్ధమయ్యాయి. 2,3,4,5 భవనాల్లో ఇప్పటికే మంత్రులు తమ శాఖలను ప్రారంభించేశారు. మిగిలిన రెండు భవనాల్లో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, రెండోది అసెంబ్లీ, మండలి సమావేశాల భవనం. ముఖ్యమంత్రి సహా ఆయన కార్యాలయ సిబ్బంది, సీఎస్, సీఎం కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ భవనం, వీడియో కాన్ఫరెన్స్, ఇతర సమావేశ మందిరాలు ఈ భవనంలోనే ఉన్నాయి. ఈ భవనం నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి.

రాకెట్ లాంచర్లతో దాడి చేసినప్పటికీ భవనానికి ఎలాంటి ముప్పు ఉండని రీతిలో సిఎం ఆఫీస్ నిర్మాణం జరుగుతుండడం విశేషం. అలాగే సిఎం భద్రత దృష్ట్యా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మిస్తున్నారు. బాబు సూచనల మేరకు కార్యాలయంలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. మొత్తం భవనాన్ని 72/70 మీటర్ల నిష్పత్తిలో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో రెండు అంతస్తులున్నాయి. మొత్తంగా లక్ష చదరపు అడుగుల మేర నిర్మాణం చేపట్టారు. 11 మీటర్లతో 36 గదులు నిర్మించనున్నారు. ఈ భవనంలో ఏడు లిఫ్ట్‌ లున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఓ లిఫ్ట్ కేటాయించారు.