am-ratnam-re-entry-to-tollywood-with-runతమిళ, తెలుగు సినిమా నిర్మాతల్లో ఉన్న ప్రముఖులలో ఏఎం రత్నం ఒకరు. అగ్ర హీరోలతోనే కాదు, శంకర్ వంటి దర్శకులకు కూడా రత్నం గారే ఎక్కువగా తారసపడేవారు. అంతలా సంచలన విజయాలను సాధించిన రత్నం గారు ఇటీవల కాలంలో ప్రేక్షకులకు చిక్కకుండా అదృశ్యమయ్యారు. తన కొడుకును హీరోగా నిలబెట్టే క్రమంలో అప్పుడప్పుడు కనపడినా, సినీ నిర్మాణానికి మాత్రం దూరంగా ఉన్నారు.

చివరగా ఏఎం రత్నం తెలుగులో ప్రకటించిన ప్రాజెక్ట్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే కావడం విశేషం. “సత్యాగ్రహి” పేరుతో పవన్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించే బాధ్యతను రత్నం గారు నెత్తికెత్తుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆదిలోనే అంతం కావడంతో మళ్ళీ పవన్ దర్శకత్వ జోలికి వెళ్ళలేదు. అలాగే ఏఎం రత్నం గారు కూడా సినీ నిర్మాణపు జోలికి వెళ్ళలేదు.

అలాంటి రత్నం గారు చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా ఆడియో వేడుకలో ముఖ్య అతిధిగా విచ్చేసి అందరికీ దర్శన భాగ్యం కల్పించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన “రన్” సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకకు విచ్చేసి, ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మరో విశేషమేమిటంటే… గతంలో తమిళంలో ఇదే టైటిల్ తో ఏఎం రత్నం ఒక సినిమాను నిర్మించి ఘనవిజయం అందుకున్నారు. ఆ విషయాన్నే గుర్తు చేసుకుని ఈ “రన్” సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అభినందనలు తెలిపారు.