Allu-Sirishవోడాఫోన్ సంస్థపై అల్లు వారబ్బాయ్ అల్లు శిరీష్ కోపం కట్టలు తెంచుకుంది. ఎంతగా ఆగ్రహం వచ్చిందంటే…. ట్విట్టర్ ఖాతాలో సదరు టెలిఫోన్ సంస్థను ఏకిపారేసేటంత! ఇంతకీ ఏమైందని అనుకుంటున్నారా? ఎయర్ టెల్ నెట్ వర్క్ ను వాడుతున్న అల్లు శిరీష్, ఇటీవల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని వాడుకుంటూ వోడాఫోన్ కు మారి, తన పాత నంబర్ నే ఉపయోగిస్తున్నారు. ఇక వోడాఫోన్ కు సిగ్నల్స్ అసలు అందడం లేదని, తాను ఓ చెత్త నెట్ వర్క్ ను ఆశ్రయించానని గుర్తించిన శిరీష్, అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

“దేని విలువైనా అది నీ దగ్గరున్నంత కాలం తెలియదు. ఈ మధ్యే ఎయిర్ టెల్ నుంచి వోడాఫోన్ మారాను. నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్ కు మారిపోయింది. 4జీ గురించి మరచిపోండి, కనీసం 2జీ సిగ్నల్స్ కూడా అందడం లేదు. కాల్ డ్రాప్స్ సంగతి పక్కనపెడితే, కనీసం సిగ్నల్ కూడా అందని పరిస్థితి. చాలా చింతిస్తున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. పుండు మీద కారం చల్లే విషయం ఏమిటంటే… ఒక్కసారి పోర్టబులిటీ పెట్టిన తర్వాత ఆ నెట్ వర్క్ లో కనీసం 90 రోజుల పాటు ఉండి తీరాల్సిందే!