ప్రస్తుతం సినిమా విజయవంతం చేసుకోవడానికి చిత్ర బృందం పడని పాట్లు లేవని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు పండగకో పబ్బానికో ఓ ఇంటర్వ్యూ ఇస్తే… అదే ఇంటర్వ్యూ మిగతా అన్ని ఛానల్స్ ప్రసారమయ్యేది. కానీ, ప్రస్తుత పరిస్థితి వేరు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా చిత్ర బృందం సినీ ప్రమోషన్ల కోసం ఛానల్స్ చుట్టూ క్యూలు కడుతున్నారు. ప్రేక్షకుల భావాలు నేరుగా తెలుసుకునేందుకు సెలబ్రిటీలకు మంచి అవకాశమే అయినా… అత్యుత్సాహంతో సెలబ్రిటీలు చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతుంటాయి.
తాజాగా అలాంటి వ్యాఖ్యలనే పలికారు అల్లు శిరీష్. ఎన్నారైలతో ఓ ప్రముఖ ఛానల్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రసారం చేసే ఓ కార్యక్రమంలో, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా హీరో అల్లు శిరీష్, దర్శకుడు పరశురాంతో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా… సినిమా విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ… సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా తీసుకు వచ్చినట్లయితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అయితే దానికి స్పందించిన అల్లు శిరీష్… ‘12 గంటల సమయంలో సినిమా ప్రమోషన్ అంటే వేరే ఉద్దేశం అనుకుంటారండి’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేయడం, అతని పరిపక్వత స్థాయిని సూచిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ‘మా కార్యక్రమం పేరు చెప్పాల్సింది’ అంటూ కార్యక్రమ నిర్వాహక యాంకర్, కాస్త దిద్దుబాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, శిరీష్ నవ్వుతూ ఆ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.
ఇలాంటి డైలాగ్ లు పేల్చి, సామాన్య ప్రేక్షకులకు హీరోయిన్లు అంటే చులకన భావన ఏర్పడేలా చేస్తున్నారని, ముఖ్యంగా తోటి హీరోయిన్లను తక్కువ చేసి వ్యాఖ్యానించడం తగదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. అసలే వివాదాస్పద వ్యాఖ్యలకు నిలయంగా అల్లు శిరీష్ నిలుస్తాడని ఇప్పటికే టాలీవుడ్ లో ఒక పేరుంది. దీనికి మరింత బలమిచ్చేలా ఓ లైవ్ షోలో అల్లు శిరీష్ ‘డబుల్ మీనింగ్’ డైలాగ్లు నిలుస్తున్నాయి.