Allu Arvind about Fidaa movieమెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నా… ఏం చేస్తున్నా… ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొంతకాలంగా అల్లు అర్జున్ కేంద్రం చెలరేగుతున్న వివాదాలతో… ‘అల్లు’ ఫ్యామిలీకి సంబంధించిన వారిని మీడియా వర్గీయులు ఓ కంట కనిపెడుతూ ఉంటోంది. బహుశా ఈ విషయం ‘మెగా ప్రొడ్యూసర్’ అల్లు అరవింద్ దృష్టికి కూడా వచ్చిందేమో గానీ, తాజాగా ‘ఫిదా సంబరాల’ వేడుకలో ఎలాంటి వివాదానికి తావు లేకుండా తన ప్రసంగాన్ని ముగించారు.

చాలా సహజ సిద్ధంగా సినిమాను తీసిన శేఖర్ కమ్ములను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పిన అరవింద్, సినిమానంతా భుజ స్కంధాలపై మోసావంటూ హీరోయిన్ సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందించారు. వరుణ్ తేజ్ గత సినిమా ప్రీమియర్ షో చూసి, ‘సారీ’ చెప్పానని, నిజానికి మరుసటి రిలీజ్ కాబోతున్న సినిమాపై అలాంటి కామెంట్ చేసి ఉండకూడదని, కానీ నిజం చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పానని, అయితే ఈ సినిమా చూసి ‘బాగా చేసావురా సినిమా బాగుంది’ అని చెప్పడంతో వరుణ్ చాలా సంతోషించాడని అన్నారు.

ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా సహజత్వంతో కూడుకుని ఉందని, అందరికీ అభినందనలు తెలుపుతున్నానని, దిల్ రాజుకు బదులు అంతా నేనే మాట్లాడేస్తున్నా… ఆయన కూడా మాట్లాడాలి అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళేముందు మరో మాట కూడా చెప్పి వెళ్లారు… తాను ఓ పెళ్ళికి హాజరు కావాల్సి ఉంది, తనను మన్నిస్తే ఆ వేడుకకు వెళ్తాను అంటూ… మీడియా మరో కోణంలో ఆలోచించకుండా… ‘ఫిదా సంబరాలు’ జరుగుతుండగానే అల్లు అరవింద్ వెళ్ళిపోయారు. అరవింద్ తీరు చూసి… ఎంత జాగ్రత్తో అనుకోవడం వీక్షకుల వంతయ్యింది..!