Allu-Arjun-Speech--Okka-Kshanam-Pre-Release-Eventఅల్లు శిరీష్ హీరోగా నటించిన “ఒక్క క్షణం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ చేసిన ప్రసంగం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ కు హితబోధ చేయడంతో పాటు కుటుంబంలోని వ్యక్తుల పైన కూడా సెటైర్లు వేయడం లాంటివి బన్నీ నుండి ఊహించినవి కాదు. ముఖ్యంగా తన తండ్రి అల్లు అరవింద్ మరియు మావయ్య నాగబాబులను ఉద్దేశించి బన్నీ కీలక వ్యాఖ్యలు చేసారు.

తన కొడుకు వేడుక కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి మరియు చిరంజీవి పంపించారు కాబట్టి ఇక్కడికి వచ్చిన నాగేంద్ర బాబు గారికి కృతజ్ఞతలు అంటూ సెటైరికల్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కుటుంబంలోని విభేదాలను బయట పెట్టిందా? అన్న సందేహాలకు తావిచ్చింది. నాగబాబు విషయంలో అల్లు అరవింద్ కూడా ఇదే రకంగా ‘చిరంజీవి పంపిస్తే ఇక్కడికి వచ్చారు’ అని వ్యాఖ్యానించడం విశేషం.

అంటే తన ఇష్టం లేకుండానే నాగబాబు ఈ వేడుకకు వచ్చారా అన్న సందేహాలకు తావిచ్చినట్లయ్యింది. అల్లు అరవింద్ అంటే వయసు రీత్యా నాగబాబు కంటే పెద్దవారు కాబట్టి పర్లేదు అనిపించినా, అవే వ్యాఖ్యలను బన్నీ కూడా రిపీట్ చేయడం అనేది విస్మయానికి గురి చేసే అంశమే. బహుశా బన్నీ కామెడీ కోసం చెప్పాననుకున్నారేమో గానీ, అందులో హాస్యం కంటే అపహాస్యమే ఎక్కువ పండింది.

బన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి ఏదొక వివాదం చెలరేగడం గత రెండు సంవత్సరాలుగా చాలా కామన్ అయిపోయింది. ఒక విధంగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఏ రకంగా పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నారో, సినీ వేడుకల మీద బన్నీ ప్రసంగాలు కూడా అలాగే మారుతున్నాయి. ఇవ్వన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవో కాదో గానీ అల్లు అర్జున్ ప్రవర్తన మాత్రం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.