Allu arjun controversyat  tamil-thalaivas-jersey-launch‘సరైనోడు’ సక్సెస్ వేదిక నుండి ప్రారంభమైన అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ వివాదం నుండి మొన్నటి ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా టైటానిక్ కామెంట్స్ వరకు ఏదొక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. వరుస సక్సెస్ లతో మంచి ఊపులో ఉన్న ఈ స్టైలిష్ స్టార్ ప్రో కబడ్డీ లీగ్ లో రామ్ చరణ్ తో కలిసి ఒక జట్టును సొంతం చేసుకున్నాడు. ‘తమిళ తలైవార్’ అన్న టీంను సొంతం చేసుకున్న బన్నీ – చెర్రీలు తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా కమల్ హాసన్‌ ను నియమించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురూ కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే వేదికపై కమల్ హాసన్, రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇది తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి ముందు అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకుని కూర్చునేంత పెద్ద నటుడైపోయాడా? అంటూ మండిపడుతున్నారు.

లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే… అల్లు అర్జున్ అలా కూర్చోవడమేంటి? సీనియర్లకు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయమే అయినా అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని మండిపడుతున్నారు. అసలే తమిళులకు భాషా, ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ.. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో గానీ, బన్నీ మాత్రం ఏదొక రూపంలో నెటిజన్లకు టార్గెట్ అవుతూనే ఉంటున్నారు.