స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదల చేశారు. సినిమాకు ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ నిర్ణయించారు. అంతేకాదు బన్నీ, మురళి శర్మ మధ్య సాగే సన్నివేశాన్ని చిన్న టీజర్ రూపంలో చూపించారు. అందులో స్టైలిష్ స్టార్ మధ్య తరగతి యువకుడిలా సింపుల్ గా కనిపించారు. ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని రావు రమేశ్ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది.
నా పేరు సూర్య తరువాత వచ్చిన గ్యాప్ ని కామెడీగా స్పృశించారు. ఈ చిన్న బిట్ బట్టి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తమకు కలిసి వచ్చే కామెడీ జోనర్ మరోసారి టచ్ చేస్తున్నారని అర్ధం అవుతుంది. సంక్రాంతికి విడుదల అయ్యే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా ఫస్ట్ లుక్ విడుదల చేశారనే చెప్పుకోవాలి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతుంది. గతంలో వారిద్దరూ డీజే లో కలిసి కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నివేత పేతురాజ్, కెటికా శర్మ మరో ఇద్దరు హీరోయిన్లు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది.