ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమా పబ్లిసిటీలో భాగంగా, ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తారని ప్రచారం జరగగా, అల్లు అర్జున్ మినహా ఇతర మెగా హీరోలు కూడా ఎవరూ తారసపడలేదు. దీంతో అసలు మెగాస్టార్ ఎందుకు రాలేదు? అన్నది చర్చనీయాంశం కాగా, తాజాగా బన్నీ దీనిపై వివరణ ఇచ్చుకున్నాడు.
‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు చనిపోయిన విషాదంలో సినీ వర్గీయులు ఉన్నారని, అందుకే ఈ వేడుకకు అసలు ఎవరినీ పిలవదలచుకోలేదని, చిరంజీవితో సహా ఎవరి పేర్లను పరిశీలించలేదని, మెగాస్టార్ వస్తున్నారన్నది కేవలం పుకారు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఒకానొక సమయంలో తమ ఈవెంట్ గురించి కూడా చర్చించుకున్నామని, అయితే సినిమాకు పబ్లిసిటీ చాలా ముఖ్యం గనుక మా చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది తప్ప, ఇతర సినీ నటులు ఎవరూ పాల్గొనలేదని వివరించారు.
ఇక, ఆ వేడుకలో అల్లు అయాన్ దండం పెడుతూ వచ్చిన విధానం చూసి తాను షాక్ అయ్యానని, తన కొడుకు స్టేజ్ పై నిలబడి అలా చేస్తాడని అస్సలు అనుకోలేదని, తనకు ఇష్టమైన దైవం శివుడు అని, చాలా పవర్ ఫుల్ గాడ్ అని అభిప్రాయపడ్డ బన్నీ, అందుకే తన ఇద్దరు పిల్లలకు శివుడు పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నానని అన్నారు. ‘డీజే’ సినిమాకు వచ్చేపాటికి ట్రైలర్ లో చూపించిన ‘సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నారు?’ అనేది వివిధ సందర్భాలలో సినిమాలో చాలా సార్లు వినియోగించామని, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.