గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం పై విరుచుకుపడితే ఆనందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారి వంతు వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న రాజధాని గ్రామాలలో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడంతో అధికారపార్టీ ఆయనని టార్గెట్ చేసింది. చంద్రబాబు నుంచి ప్యాకేజి ముట్టినపుడు ఒకరకంగా, అందనపుడు ఇంకో రకంగా మాట్లాడటం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృస్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్, నాలుగుసార్లు భూసేకరణ జరిపినపుడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. పవన్కు నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయలేదని, కనీసం జనసేన అభ్యర్థినైనా పోటీలో దింపలేదని విమర్శించారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారనుకున్నా.. వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదని ఆర్కే ప్రశ్నలు సంధించారు. లోకేష్ను గెలిపించడానికి పవన్ తెర వెనుక చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసని వ్యాఖ్యానించారు.
ఇన్నిరోజుల పత్తాలేని పవన్ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు పర్యటిస్తే జనం నమ్మరని ఆయన అన్నారు. మరోవైపు సాక్షి ఏకంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వ్యాసం రాసింది. పవన్ కళ్యాణ్ సమస్య అదే కదా… ఆయన అభిమానులు అన్ని పార్టీలలోనూ ఉంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఓట్లు మాత్రం వారివారి పార్టీలకే వేసుకుంటారు. ఇందులో పెద్ద వింత ఏముంది? అది అలా ఉంచితే గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు జగన్ ప్యాకేజీ ఇచ్చినట్టా?