alampur mla sampath kumar joining trsతెలంగాణ శాసనసభ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి ఫిరాయింపులకు తెగబడింది. శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను సభలో సోమవారం పక్కకు తీసుకెళ్లి తమ పార్టీలో చేరాలని హరీశ్‌ ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం.

సంపత్‌కుమార్‌తో మంత్రి హరీశ్‌రావు దాదాపు 20 నిమిషాలకుపైగా మంతనాలు జరిపారు. అసెంబ్లీలోనూ, ప్రజల్లోనూ పార్టీ పనితీరుపై అసంతృప్తి ఉన్నట్టుగా సంపత్ కుమార్ ఇటీవలే బహిరంగంగా విమర్శించారు. గత కొంతకాలంగా మంత్రి హరీష్‌రావుతో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం కాంగ్రెస్‌ పార్టీలోనూ జరుగుతోంది.

అయితే ఈసారి శాసనసభలోని మాటా మంతి జరగడం చర్చనీయాంశం అయ్యింది. టీడీపీకి చెందిన ముఖ్యనేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరడంతో, ఆ పార్టీని నైతికంగా దెబ్బ తీసే విధంగా సంపత్‌కుమార్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే హరీష్‌రావు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం.