Ala Vaikunthapurramloo - Sarileru Neekevvaru sankranthi releaseఢీ ఢీ అంటే ఢీ అని కయ్యానికి కాళ్ళు దువ్విన సంక్రాంతి పుంజులు మొత్తానికి వెనక్కు తగ్గాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ నేతృత్వంలోని యాక్టీవ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇరు వర్గాలతో జరిపిన చర్చలు పని చేశాయి. గతంలో ప్రకటించిన రిలీజ్ తేదీలకు కట్టుబడాలని ఇరు వర్గాల వారూ నిర్ణయించడం విశేషం.

దీనితో సరిలేరు నీకెవ్వరూ 11న, అల వైకుంఠపురంలో 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. థియేట‌ర్ల విష‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల్ని స‌ర్దుబాటు చేసి విడుద‌ల తేదీలు య‌థావిధిగా ఉండేలా ఒప్పించారు. దాంతో ఎట్ట‌కేల‌కి సినిమాల విడుద‌ల విష‌యంలో ఒక స్ప‌ష్ట‌త ఏర్ప‌డిన‌ట్టైంది.

12న అల వైకుంఠపురంలో సినిమాకు మరిన్ని థియేటర్స్ ఇవ్వడానికి సరిలేరు నీకెవ్వరూ బృందం ఒప్పుకున్నట్టు సమాచారం. దీనితో ట్రేడ్ ఊపిరి పీల్చుకుంది. ఈ రెండు సినిమాలపై దాదాపుగా 200 కోట్ల బిజినెస్ జరిగింది. క్లాష్ అంటూ జరిగితే ఇరు సినిమాల వారు నష్టపోయేవారు.

దీనితో ఈ నిర్ణయాన్ని వారు ఆహ్వానిస్తున్నారు. ఇక సంక్రాంతి సినిమాల ప్ర‌చారం రేప‌ట్నుంచి హోరెత్త‌నుంది.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు జరుపుకోబోతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి.