Akkineni Fans confident on Akhil Hello Director Vikram‘మనం’ సినిమా తర్వాత దర్శకుడిగా విక్రమ్ కే కుమార్ రేంజ్ మారిపోయిందన్నది వాస్తవం. ప్రతి అగ్ర హీరో కూడా విక్రమ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని ఊవ్విళ్ళూరారు. అయితే ఆ తర్వాత సూర్యతో “24” అనే సినిమాను తీసిన విక్రమ్, ప్రస్తుతం అఖిల్ తో “హలో” అనే సినిమా ద్వారా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఫలితంపై ‘నాగ్ అండ్ కో’ పూర్తి విశ్వాసంతో ఉండగా, విక్రమ్ సెంటిమెంట్ ప్రకారం అయితే ‘హలో’ బొమ్మ అదిరిపోయే స్థాయికి చేరుకుంటుందని అక్కినేని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. దర్శకుడిగా విక్రమ్ తన సినిమాలలో ఏదొక వస్తువును సెంటిమెంట్ గా వినియోగిస్తుంటారు. తన తొలి చిత్రం “13”లో టీవీని వినియోగించగా, “మనం”లో క్లోక్ టవర్ ను వాడారు.

అలాగే మునుపటి సినిమా “24”లో వాచ్ ను చూపించగా, ప్రస్తుత “హలో” సినిమాలో మొబైల్ ఫోన్ చుట్టూ కధను అల్లిన సంగతిని ట్రైలర్ స్పష్టం చేసింది. అలాగే ఒకటి, మూడవ సినిమాలు ప్రేక్షకులను అంతంత మాత్రంగా ఆకట్టుకోగా, రెండవ చిత్రం ‘మనం’ క్లాసిక్ గా నిలిచిపోగా, నాలుగవది అయిన ‘హలో’ కూడా అదే స్థాయిలో ఉంటుందన్నది సెంటిమెంట్ వర్గాల అంచనా. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో ఈ నెలలోనే తేలిపోనుంది.