భారీ అంచనాలతో విడుదలైన అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ దారుణ పరాజయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా వైఫల్యం నుండి కోలుకుని మరో సినిమా చేయడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం తీసుకున్న అఖిల్, ఇటీవలే తన రెండవ సినిమాను హను రాఘవపూడితో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదలుపెట్టడానికి తానూ ఫుల్ ఛార్జ్ కావాలి… ఎలా… ఎలా..? అని అనుకున్నాడట అఖిల్.
అందుకు వేదికగా “ఆటాడుకుందాం రా” సినిమా ఆడియో వేడుక అయ్యింది అంటూ రెట్టించిన ఉత్సాహంతో చెప్పాడు అఖిల్. తమ ఫ్యామిలీ హీరోల సినిమాలకు అద్భుతమైన సంగీతం అందిస్తున్న అనూప్ రూబెన్స్, అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక సంగీత దర్శకుడు వస్తే ఎలా ఉంటాడో… అనూప్ అలా ఉంటాడని ఆకాశానికేత్తేసాడు. తనకు, ఇతర హీరోలకు ఏదైనా ఇతర అంశాలపై ఆసక్తి ఉంటుందేమో గానీ, సుశాంత్ కు మాత్రం సినిమాలు తప్ప వేరే ధ్యాస ఉండదని, అతనికి రావాల్సిన సక్సెస్ ఈ ‘ఆటాడుకుందాం రా’ సినిమా ద్వారా లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పిన అఖిల్, తర్వాత అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాడు.
నాన్న గారు ఇక్కడికి రాలేకపోతున్నందుకు ‘సారీ’ చెప్పారని, బాంబేలో అమితాబ్ గారితో యాడ్ షూట్లో ఉన్నారని, అయినా మీ గుండెల్లో ఎప్పుడూ ఉంటారు గనుక ఆయన ఇక్కడ ఉన్నట్లేనని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ని నూతన ఉత్సాహాన్నిచ్చాయి. “మీరే మా ధైర్యం… మీరే మా బలం… త్వరలోనే అక్కినేని అభిమానులందరికీ పండగ సీజన్ ప్రారంభం కాబోతోంది… వరుసగా వస్తున్నాయి సినిమాలు… నేనూ వస్తున్నా… నేనూ వస్తున్నాను… మీరు ఇవాళ చార్జింగ్ ఇచ్చారుగా… ఇది చాలు… నేనీక చెలరేగిపోతాను…” అంటూ అక్కినేని ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి.
రెండవ సినిమాతోనే ఫ్యాన్స్ ని బుట్టలో పడేసే మాటలతో ‘ఆటాడుకుందాం రా’ ఆడియో వేడుకకు అఖిల్ ‘హైలైట్’ అయ్యారనేది అభిమానుల మాటలు. మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే… అఖిల్ రెండవ సినిమా కంటే ముందే మరోసారి వెండితెరపై అక్కినేని అభిమానుల కోసం ప్రత్యక్షం కానున్నారనేది లేటెస్ట్ న్యూస్. ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అఖిల్ కనిపించనున్నారనేది అక్కినేని అభిమానులకు పండగ లాంటి వార్త. అలాగే నాగచైతన్య ఓ అతిథి పాత్రలో కనువిందు చేయనున్నాడు. దీంతో ఈ ‘ఆటాడుకుందాం రా’ సినిమా కోసం అక్కినేని అభిమానుల ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి.