అక్కినేని మూడో తరం వారసులు, నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ తమ ఇమేజ్ కు తగ్గట్ట్టే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ముందుగా పెద్దవాడైన నాగ చైతన్య, సమంతతో ప్రేమలో ఉన్నాడని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తరువాత వాళ్లిద్దరూ బహిరంగంగానే ప్రేమాయణం సాగించడం, నాగార్జున బయటికొచ్చి వారి ప్రేమను సంతోషంగా అంగీకరించడంతో అక్కడితో కథ ముగిసిందని అందరూ అనుకున్నారు.
ఆ వెంటనే చిన్నవాడైన అఖిల్ మెల్లగా తన ప్రేమ వ్యవహారాన్ని సైతం బయటకు వదిలాడు. మీడియా కూడా చొరవ తీసుకుని కూపీ లాగడంతో అఖిల్ ప్రేమించే అమ్మాయి ఓ వ్యాపార కుటుంబానికి చెందినదని, ఆమె కుటుంబానికి, అఖిల్ కుటుంబానికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయాని, ఆమె పరిశ్రమలోనే ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తోందని, పేరు శ్రేయా భూపాల్ అని అందరికీ తెలిసిపోయింది.
కానీ అఖిల్ మాత్రం ఆమె ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. అన్నలాగా చెట్టా పట్టాలేసుకుని తిరగలేదు. తండ్రి నాగార్జున కూడా వారి ప్రేమను అంగీకరించాడు. దీంతో అఖిల్ ఎట్టకేలకు ఆమెతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో కెమెరాలకు చిక్కాడు. సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చిన ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.