ఎంతటి వారికైనా కఠిన పరీక్షలు తప్పవంటే ఇదేనేమో. తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉంటూ… ఎలాంటి తలనొప్పి కార్యక్రమాలు లేకుండా, ఆహ్లాదకరమైన జీవితం గడపంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన అక్కినేని కుటుంబానికి ‘అఖిల్ వివాహం’ రూపంలో పెద్ద చిక్కువచ్చి పడినట్లయ్యింది. అట్టహాసంగా జరిగిన నిశ్చితార్ధ వేడుకకు అర్ధం లేదని, శ్రియా భూపాల్ తో అఖిల్ వివాహం రద్దయ్యిందన్న వార్తలు మీడియా వర్గాలలో ప్రధానంగా వినపడుతున్నప్పటికీ, ఇరు కుటుంబాల నుండి ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం విశేషం.
ఇలాంటి వార్తల్లో వాస్తవం లేకపోతే, ఈ పాటికే ఇరు కుటుంబాలు స్పష్టత ఇచ్చి ఉండేవని, మొత్తానికి రెండు కుటుంబాల మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ప్రకటన చేస్తే బాగుంటుందన్న ధోరణిలో రెండు కుటుంబాలు వేచిచూస్తున్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం ఇటు ప్రజలకు, మీడియాకు అతి దగ్గర వ్యక్తులు కావడంతో, సాధారణంగా బయట ఎప్పుడు కనపడతారా? ఈ ప్రశ్న గురించి అడుగుదాం అని ఎదురుచూస్తున్నారు.
అలాంటి అవకాశం అమల రూపంలో మీడియా వర్గీయులకు దక్కింది. మాదాపూర్ లో ఓ సెలూన్, స్పాను ప్రారంభించడానికి విచ్చేసిన అక్కినేని అమలను మీడియా వర్గీయులు పలకరించడానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం ముందుగానే గ్రహించిన అమల, మీడియాకు ఆ అవకాశం ఇవ్వకుండా తిరిగి వెళ్ళిపోయారు. ఒక్క అమల మాత్రమే కాదు, ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి చెందిన ఎవరు మీడియాకు కాస్త దగ్గరగా ఉన్నా, అందరి పరిస్థితి ఇదే. అఖిల్ పెళ్లిపై స్పష్టత వచ్చే వరకు మీడియాకు ఆరడుగుల దూరంలో ఉండడమే ఉత్తమం అని అక్కినేని ఫ్యామిలీ ఫిక్స్ అయినట్లుగా కనపడుతోంది.