Akkineni Akhil Majnu in pogal raceకేరింత లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీని అందిచిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన అక్కినేని చిచ్చర పిడుగు అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్-మజ్ను’. అఖిల్ ని మరోమారు మంచి రోమటిక్ బోయ్ గా చూపించబోతున్న ఈ చిత్రం పై స్పెషల్ అప్‌డేట్ ఒకటి అందింది. అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది అని, అయితే ఇంకొక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని అది కూడా పూర్తి చేసుకుని జనవరిలో మీ ముందుకు వచ్చేస్తున్నా అంటూ ట్వీట్ చేసేసాడు అఖిల్.

కట్ చేస్తే అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. జనవరకి వస్తున్నా అంటే అది ఖచ్చితంగా సంక్రాంతికే అయ్యి ఉంటుంది. కాకపోతే అదే జరిగితే చివరకి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి కూడా అలనాటి లవ్ ఫేల్యూర్ మజ్ను లాగా అయిపోతుందేమొ అని ఫాన్స్ టెన్షన్స్ పడుతున్నారు. ఎందుకంటే పండగ బరిలో రెండు పదెం కోళ్లు, ఒకటి “ఎన్టీఆర్-బయోపిక్”తో బాలయ్య, మరొకటి “వినయ-విధేయ-రామ”తో చెర్రీ ఉన్నారు. మరి వీరి మధ్య పొరపాటున అఖిల్ ఎంటర్ అయితే రోడ్డు వైడెనింగ్ లో సగం తీసేసిన బిల్డింగ్ లాగా అయిపోతుంది పరిస్థితి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అదేంటి అంటే అఖిల్ జనవరిలో మీ ముందుకు వస్తున్నా అంటూ చెప్పాడు కానీ, పండగకి బరిలో ఉంటా అని మాత్రం ఎక్కడా స్పష్టం చెయ్యలేదు.

అయితే జనవరిలో మరో ఆప్షన్ అయిన జనవరి25 రిపబ్లిక్ డే ను అఖిల ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైమ్ కి ఈ బడా సినిమాలు రెండూ రెండు వారాల రన్ టైమ్ పూర్తి చేసుకుని అఖిల్ కి కాస్త స్పేస్ ఇస్తాయి. మొత్తంగా చూసుకుంటే ‘మిస్టర్-మజ్ను’ త్వరలోనే అభిమానులకు మంచి రొమ్యాంటిక్ విందును అందించనున్నాడు అన్న మాట. ఎంతైనా ఆ తరం మజ్ను(నాగ్) వారసుడు కదా.