తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా “అఖండ” విడుదల కోసం ఎదురు చూస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతోన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రానుంది? అలాగే ఏపీలో నెలకొన్న షోల నియంత్రణ ఎంతటి ప్రభావం ఇండస్ట్రీపై పడనుంది? అన్న లెక్కలకు కొలమానంగా “అఖండ” సినిమా నిలవబోతోంది.
అయితే ఏపీ సర్కార్ ఇటీవల అమలు చేసిన అదనపు షోల నియంత్రణను అంగీకరించే దిశగా ధియేటర్ యాజమాన్యాలు లేవని ప్రముఖ టీవీ 5 ఛానల్ సంచలన కధనాలను ప్రసారం చేస్తోంది. అవసరమైతే జగన్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకోవడానికి ధియేటర్ యజమానులు సిద్ధమవుతున్నట్లుగా ఈ కధనం సారాంశం.
అలాగే ప్రభుత్వం తాజాగా ధరలను అమలు పరిస్తే కనీసం కరెంట్ ఖర్చులు కూడా రావని, జగన్ సర్కార్ రేట్లను అమలు చేయకుండా, గతంలో ఇచ్చిన ధరలకే టికెట్లు అమ్మడానికి సిద్ధమైనట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు. దీంతో “అఖండ” రిలీజ్ ఏపీలో మరింత ఉత్కంఠను రేపుతోంది.
ఒకవేళ ప్రభుత్వం షోలను అడ్డుకునే పరిస్థితే నెలకొంటే అవసరమైతే ధియేటర్లను మూసివేయడానికి కూడా ధియేటర్ వర్గాలు సిద్ధమైనట్లుగా తెలుపుతున్నాయి. కరోనా తర్వాత కోలుకుని ఇప్పుడే పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో… ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం గుదిబండలా మారిందని ధియేటర్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు.
జగన్ సర్కార్ ను ఎదురొడ్డి అదనపు షోలను, అంతకు ముందు ఉన్న టికెట్ ధరలతో ధియేటర్ యజమానులు “అఖండ”ను ప్రదర్శించగలుగుతారా? అలా జరిగితే జగన్ సర్కార్ చూస్తూ ఊరుకుంటుందా? ఒకవేళ షోలను అడ్డుకునే పరిస్థితి వస్తే సినిమా చూసే అభిమానులు తట్టుకోగలుగుతారా? ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది.