అసభ్యకర ఫొటోలు పంపుతున్నాడంటూ ఓ మహిళ బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే నేడు పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మల్వానీకి చెందిన ఓ మహిళకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా ఫ్రెండ్ అయిన ఎజాజ్ ఖాన్, సదరు మహిళతో ప్రతిరోజు చాటింగ్ చేస్తూ ఉండేవాడు. బొటీక్ నిర్వహిస్తున్న ఆ మహిళకు డబ్బు అవసరం రావడంతో ఎజాజ్ ను డబ్బు కావాలని కోరింది.
అయితే సదరు మహిళకు ఎజాజ్ డబ్బు ఇస్తానని, తనను కలవడానికి రమ్మని చెప్పాడు. అయితే, ఎజాజ్ ని కలవడానికి ఆ మహిళ వచ్చినప్పుడు ఎజాజ్ షూటింగ్లో ఉండడంతో ఆమె కలవకుండానే వెనుతిరిగింది. అనంతరం ఎజాజ్ ఆ మహిళకు ఫోను చేసి ఆమె వచ్చినప్పుడు బిజీగా ఉన్నానని, మళ్లీ కలవడానికి రమ్మని చెప్పాడు. అయితే, సదరు మహిళ మళ్లీ రావడానికి ఒప్పుకోలేదు. అనంతరం వాట్సప్ లో ఎజాజ్ పెట్టుకున్న ప్రొఫైల్ పిక్చర్ బాగుందని సదరు మహిళ మెసేజ్ పెట్టింది.
ఇదే అదునుగా తీసుకుని, సదరు మహిళకు సారీ చెబుతూ పలుసార్లు అసభ్యకర ఫొటోలు పంపాడు. దీంతో ఆ మహిళ ఇటీవల చేసిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై ఎజాజ్ మీడియాతో మాట్లాడుతూ… తానెవరికీ మెసేజ్లు, ఫొటోలు పంపలేదని వ్యాఖ్యానించాడు. తాను ఓ సెలబ్రిటీ అయినందుకే తనపై ఆరోపణలు చేస్తూ వేధించాలని చూస్తున్నారని అన్నాడు. ఈ నటుడు తెలుగులో ‘దూకుడు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.