aishwarya rai limited dates for chiranjeeviమెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ పూర్తి అయ్యింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు తన కొరటాల శివతో తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నారు చిరంజీవి. అయితే ఆయన పక్కన హీరోయిన్ ని ఫైనల్ చెయ్యడం తలకు మించిన భారం అవుతుంది కొరటాలకు. చిరంజీవి ఏజ్, ఇమేజ్ కు తగ్గ హీరోయిన్లు పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణం. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయిను ఈ చిత్రం కోసం సంప్రదించారట నిర్మాతలు.

అయితే ఆమె పెట్టిన కండిషన్లకు విస్తుపోయారట. సినిమా కోసం తాను ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేను అని, వారు కోరిన దాంట్లో సగం మాత్రం ఇవ్వడానికి సిద్ధం అని చెప్పిందట. దానికి తోడు బల్క్ డేట్స్ కాకుండా తన వీలును బట్టి డేట్స్ ఇస్తా అని చెప్పిందట. అంతటితో ఆగకుండా కొన్ని కీలకమైన ఘట్టాలు ముంబై లోనే షూట్ చెయ్యాలని రూల్ పెట్టిందట. దీనితో పాటు చిత్రానికి డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే కావడంతో ఆమెను తీసుకోవడం అనుమానమే అని తెలుస్తుంది.

కుదరకపోతే నయనతార, అనుష్క, శృతి హస్సన్ లో ఎవరో ఒకరిని తీసుకోవచ్చని సమాచారం. మరోవైపు సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ (చిరంజీవి సొంత బ్యానర్) పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.