reliance-jio-ambani‘జియో’ రంగప్రవేశంతో టెలికాం కంపెనీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు నెలల పాటు ఉచిత కాల్స్ మరియు డేటా ఆఫర్ తో సంచలనంగా ప్రవేశించిన జియో కాల్స్ ను ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా తదితర నెట్ వర్క్ లు అంగీకరించడం లేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పిన రిలయన్స్ జియో తాజాగా, ‘ఎంఎన్పీ’ (మొబైల్ నెంబర్ పోర్టబులిటీ)పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

వినియోగదారులు నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర సంస్థలు అడ్డుకుంటున్నాయంటూ, కస్టమర్లు కొత్త నెట్‌వర్క్‌ కు మారేందుకు ఈ సంస్థలు అంగీకరించడం లేదని పేర్కొంది. యూజర్ల రిక్వెస్టులను ఆయా సంస్థలు నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయని, ఈ నెల 9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో నెంబర్ పోర్టబిలిటీ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాయని వివరించింది.

ఇవి కాక, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు చేసుకున్న 4,919 రిక్వెస్టులు వీటికి అదనమని పేర్కొంది. ఆయా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాల్సిందిగా ‘ట్రాయ్’కు లేఖ రాసింది. ఇటువంటి సంస్థల లైసెన్స్‌ లు రద్దు చేయాలని ట్రాయ్ ను రిలయన్స్ కోరింది. మరోవైపు రిలయన్స్ ఆరోపణలపై సదరు సంస్థలు ప్రతిస్పందించకపోవడం విశేషం.