ఉచిత ఆఫర్ తో ఇతర నెట్వర్క్ కంపెనీల నడ్డివిరుస్తున్న రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా భారతీ ఎయిర్ టెల్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన తర్వాత కూడా ‘ఉచిత ఆఫర్’ కొనసాగింపునకు ఎలా అనుమతి ఇచ్చారంటూ ట్రాయ్ ను నిలదీసింది. ఈ మేరకు టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిలయన్స్ జియోకు ట్రాయ్ వంతపాడుతోందని ఆరోపించింది.
అంతేకాకుండా, జియో చర్యలను చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శించింది. జియో ఉచిత వాయిస్, డేటా సేవలను ఇక ముందు కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేయాలని ట్రిబ్యునల్ను కోరింది. ట్రాయ్ ఆదేశాల ఉల్లంఘన కారణంగా తాము ప్రతి రోజు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఎయిర్టెల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉచిత కాల్స్ వల్ల పెరిగిన ట్రాఫిక్తో తమ నెట్వర్క్ దెబ్బతింటోందని, అందుకే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరించింది.