agri gold on other scamచిట్ ఫండ్ పేరుతో డిపాజిట్లు సేకరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షలాది కస్టమర్లను నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ సరికొత్త మోసం వెలుగు చూసింది. సేకరించిన డిపాజిట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఒకే పట్టా కలిగిన స్థలాన్ని పదుల సంఖ్యలో వ్యక్తులకు అమ్మడం ఒక ఎత్తయితే… కట్టు కధలు చెప్పి ఆ స్థలం కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి మళ్ళీ సరికొత్త రూపంలో వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వసూళ్లకు అగ్రిగోల్డ్ ఎంచుకున్న మార్గం ప్లాట్ ఆవరణలో చెట్ల పెంపకం!

పదేళ్లలో మంచి కాపుకొచ్చే మామిడి చెట్టు నాటాలంటే ప్లాట్ యజమాని ముందుగానే పది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లుగా సమాచారం. అలాగే “ప్లాట్ లో ఎర్రచందనం చెట్లు నాటుతాం, పదేళ్ల తరువాత చెట్టును లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు” అంటూ కస్టమర్లకు ఎరవేసి, అసలు మొక్కలే నాటకుండా చెట్టుకి 20 వేల రూపాయలు వసూలు చేసినట్టు అగ్రిగోల్డ్ నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు చెబుతున్నారు. నెల్లూరు పరిధిలో ఈ తరహాలో భారీ ఎత్తున అగ్రిగోల్డ్ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.