నవీన్ పోలిశెట్టి టైటిల్ రోల్ పోషించిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తాజాగా ఆ సినిమాకు మరో రెండు భాగాలు రాబోతున్నాయని అంటున్నారు. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ప్రస్తుతం స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ డైరెక్టర్ చేస్తున్న ప్రాజెక్టు తరువాత వీటిని తెరకెక్కిస్తాడు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఆ దర్శకుడు ఈ స్క్రిప్టుల పనిలో పడ్డాడు. ఈ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి.
లాక్ డౌన్ తరువాత ఆయా భాషలలో ఆ రీమేక్ సినిమాల అధికారిక ప్రకటన ఉంటుంది. ఇంకో విశేషమేమంటే, ఈ సినిమా జపాన్ భాషలో అనువాదమవుతోంది. సెప్టెంబర్ 11న అక్కడ విడుదలవుతోంది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఒక చిన్న సినిమాకు ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి.
మరోవైపు నవీన్ ప్రస్తుతం జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహానటి వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్ నెలకొంది.