సినీ కుటుంబాలలో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే… అది అక్కినేని వారితో పాటు ఘట్టమనేని కూడా..! అయితే వైసీపీలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుకు తొలుత రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ పేరు.., చివరికి విజయసాయిరెడ్డి ఫైనల్ అయిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వని ఆదిశేషగిరిరావుకు తాజాగా పార్టీలో ఓ కీలక పదవి వరించింది.
పార్టీ క్రమశిక్షణా కమిటీని పునర్వ్యవస్థీకరించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 మంది సభ్యులతో కొత్త క్రమశిక్షణా కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చోటు దక్కింది. కమిటీలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో పాటు మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున సభ్యులుగా ఉన్నారు.