కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 3 నుండి మొదట ఎలిమినేటైన సెలబ్రిటీ హేమ. హౌస్ నుండి బయటకు వచ్చాక టీవీ ఛానెల్స్ కు తిరిగి షో మీద, నిర్వాహకుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. “మొదటివారంలో ఫోకస్ మొత్తం నాపైనే ఉంది.. నేను బిగ్బాస్లో ఎలాంటి పొరపాట్లు చేయలేదు.. కొన్ని విషయాలు ఎడిటింగ్ చేసి బయటకు చూపించలేదు. అందుకే ప్రేక్షకులు కూడా నన్ను అర్ధం చేసుకోలేకపోయారు, అంటూ వాపోయింది హేమ.
అంతటితో ఆగకుండా తన సహా పోటీదారుల మీద కూడా విమర్శలు గుప్పించారు ఆమె. “కొత్త జనరేషన్ నన్ను సరిగా అర్థంచేసుకోలేకపోయింది.. మెంటల్గా స్ట్రాంగ్గా ఉందామని బిగ్బాస్కు వెళ్లా. అక్కా.. అక్కా అంటూనే నాపై లేనిపోనివి చెప్పి బయటకు పంపారు.. నేను ఇంకా బిగ్బాస్ హౌస్లో ఉండేదాన్ని,” అని అన్నారు ఆమె. శ్రీముఖిది చాలా కన్నింగ్ క్యారెక్టర్.. ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్పి గొడవలు పెడుతుంది.. తర్వాత బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది శ్రీముఖే అంటూ జోస్యం చెప్పారు.
ఇదే క్రమంలో ఆమె తన రాజకీయ అరంగేట్రం గురించి కూడా పెదవి విప్పారు. “త్వరలో రాజకీయాల్లోకి వస్తా… సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టం.. వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతానేమో?,” అన్నారు ఆమె. రాజకీయాలు హేమకు ఏమీ కొత్తేమి కాదు. 2014 ఎన్నికలలో ఆమె అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యఆంధ్ర పార్టీ తరపున మండపేటలో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆమె కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు.