అంతర్జాతీయ బ్యాంకు స్కాములో ఇరుక్కున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శనిలా దాపురించాడని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ పై మండిపడుతూ, బ్యాంకుల స్కాముపై ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రయోజనాలపై ఉన్నట్టు కనిపించడం లేదని, ప్యాకేజీకి అంగీకరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పే లెక్కలు ఆయనకైనా అర్థమయ్యాయా? అని ప్రశ్నించిన శివాజీ, ఆయన చెప్పినట్టే ప్రత్యేక హోదా కాకుండా ఎక్కువగా నిధులు రాష్ట్రానికి ఇస్తారనుకుందాం. ఈ నిధుల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అంటూ నిలదీశారు. ఎంతసేపూ కేంద్రం ఎక్కువ డబ్బులిస్తామంటోంది, ఎక్కువ డబ్బలిస్తామంటోందని సుజనా చౌదరి చెబుతున్నారని, ఆ నిధుల వల్ల ప్రజలకు నేరుగా జరిగే మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధుల వల్ల సుజనా చౌదరికే ఎక్కవ మేలు జరుగుతున్నట్టుందని సెటైర్లు వేసారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని, ఈ హడావుడి చూస్తుంటే… మేము పోరాడామని గొప్పగా చెప్పుకునేలా కనిపిస్తోంది తప్ప, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడేలా కనబడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. సుజనా చౌదరిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన శివాజీ, ప్రస్తుత హంగామా అంతా డ్రామాగా కొట్టిపడేసారు. అంతకుముందు ఓ సారి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంటానని మీడియా వేదికగా చెప్పిన శివాజీ, మరోసారి అలాంటి హెచ్చరికలనే వెలిబుచ్చారు. అయితే ఈ సారి టార్గెట్ బిజెపి కాకుండా… సుజనా చౌదరిపై బాణం గురిపెట్టారు.