పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి మణి శర్మ సంగీతం చేస్తున్నారు. ఆయన మెగాస్టార్ తదుపరి చిత్రం ఆచార్య కోసం సంగీతం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రికార్డింగ్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. మణి శర్మ ఒక ఇంటర్వ్యూలో, తాను ఐదు పాటలు కంపోజ్ చేశానని, వాటిలో కొన్నింటిని ఇప్పటికే రికార్డ్ చేశానని వెల్లడించాడు.
“చిరంజీవి మరియు రెజీనా పై ఒక ఐటమ్ సాంగ్ ఇప్పటికే షూట్ చెయ్యడం జరిగింది. ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ఉంది. అతిథి పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కు ఒక రొమాంటిక్ డ్యూయెట్ కూడా ఉంటుంది” అని ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ చిత్రం లాక్ డౌన్ కు ముందే దాని 40% షూటింగ్ పూర్తి చేసింది.
చిత్ర షూటింగులను తెలంగాణ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ప్రతిరోజూ హైదరాబాద్లో కేసులు పెరగడంతో చిరంజీవి షూటింగ్ ప్రారంభించే పరిస్థితిలో లేరు. పరిస్థితులను బట్టి ఆచార్య సంక్రాంతి విడుదలను కోల్పోయి ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. సినిమా షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అంటే ఏ విధంగానూ ఈ చిత్రాన్ని సంక్రాంతికి వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం లేదు. ఆచార్యలో చిరంజీవి ఒక మాజీ నక్సలైటుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుంది.