తండ్రి పాత్రలో ఉండి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ తమకు న్యాయం చేయడం లేదని, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, సభలో తమకు అవకాశం ఇవ్వడం లేదని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, అధికార దుర్వినియోగం చేస్తున్నారని… అందుకనే స్పీకర్ గారిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని చర్చలో భాగంగా వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఇప్పటివరకు 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, మొత్తమ్మీద అధికార పక్షానికి 25 గంటలు సమయం ఇవ్వగా, ప్రతిపక్షానికి 20 గంటలు సమయం ఇచ్చారని, ఇదంతా తానేదో చెప్తున్నది కాదని, సభా సమావేశాల్లో రికార్డెడ్ అయిన విషయమని, ఇంకా స్పీకర్ గారు ఎవరి గొంతు నొక్కారని, ఇచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోకుండా అసత్య ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు.
జగన్ వంటి నాయకులకు కూడా ఎక్కడా పక్షపాతం చూపకుండా అవకాశం కల్పించిన ఘనత కోడెల శివప్రసాద్ గారిదని, గత నాలుగు సార్లుగా అసెంబ్లీలో ఉన్నానని, ఒక్క స్పీకర్ కూడా కోడెల మాదిరి వ్యవహరించలేదని, అలాంటి స్పీకర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టినందుకు చెంపలేసుకుని, అవిశ్వాసాన్ని వైసీపీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేసారు అచ్చెన్నాయుడు.