Prabhas నరదృష్టికి నాపరాళ్ళైనా మిగిలిపోతాయి అని అంటారు పెద్దలు… బాహుబలికి కూడా అదే నరదృష్టి తగిలిందేమో అని అంటున్నారు కొందరు. నిన్న ప్రభాస్ రెండు చిత్రాలకు సంబంధించి రెండు ప్రమాదాలు జరగడం గమనార్హం. ప్రభాస్ మొట్టమొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం… ఆదిపురుష్ నిన్న షూటింగ్ మొదలుపెట్టింది.

ముంబైలోని ఒక స్టూడియో లో షూటింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రాణనష్టం జరగలేదు. మొదటిరోజే ఇలా జరగడం అంతా కలత చెందారు. అయితే అది మర్చిపోక ముందే కొన్ని గంటల తరువాత ప్రభాస్ మరో చిత్రం సలార్ కి కూడా ఒక ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలో చిత్ర యూనిట్ సిబ్బందికి ప్రమాదం జరిగింది.

గోదావరిఖని శ్రీనగర్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో యూనిట్ వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. దానితో పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఏది ఏమైనా ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులు కలత చెందుతున్నారు. ప్రభాస్ ఫేమ్ ప్రస్తుతం పీక్ స్టేజి లో ఉంది.

దేశవ్యాప్తంగా ఏ స్టార్ కూడా లేనంత బిజీగా ఉన్నాడు. పైగా అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ఇక తెలుగు సినిమా హీరోల విషయానికి వస్తే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ఈ తరుణంలో తమ అభిమాన హీరోకు నరదృష్టి తగిలిందని… ఏవైనా శాంతి పూజలు చేయించాలని అంటున్నారు ప్రభాస్ అభిమానులు. కొందరైతే సొంతంగా అటువంటి పూజలు చేయించడానికి సిద్ధం అవుతున్నారు.