షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెడుతుందని ఆంధ్రజ్యోతి వార్త ప్రసారం చేసినప్పుడు ఎవరు నమ్మలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ వారైతే ఆర్కే మీద విరుచుకుపడ్డారు. మొన్న ఆ మధ్య… షర్మిల పార్టీ గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని వెటకారం ఆడారు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.
దానికి ఇప్పుడు ఆర్కే గట్టి రిటార్ట్ ఇచ్చారు. “విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది,” అని రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో వార్నింగ్ ఇచ్చారు.
షర్మిల విషయంలో ఇలాగే లైట్ తీసుకుని ఆ తరువాత భంగపడిన వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు ఈ సారి మాత్రం కలవరపడుతున్నారు. “అసలు ఆర్కే దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎప్పుడు లీక్ చేస్తారు? అసలు పార్టీకి సంబంధించిన విషయాలు ఆర్కే కు లీక్ చేస్తుంది ఎవరు?,” అని వారు మదనపడుతున్నారు.
విజయసాయి రెడ్డి జగన్ కు అంతరంగికుడు. పైగా జగన్ కంపెనీల ఆడిటర్. జగన్ మీద ఉన్న కేసులు అన్నిటిలోను రెండవ నింధితుడు. అటు పార్టీలోనూ ప్రభుత్వం లోనూ కీలక వ్యక్తి గా ఉన్నారు. అటువంటి వ్యక్తికి సంబంధించిన లీకులు అంటే అది రాష్ట్ర రాజకీయాలలో సంచలనమే అవుతుంది.