ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంతగా దూసుకెళ్తున్నా… వారిపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. రాజకీయాల్లో కూడా ఈ వేధింపులు సాగుతున్నాయని, గత వారం ఆత్మహత్య చేసుకుని మరణించిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ మహిళా కార్యకర్త తల్లిదండ్రులు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) ముందు విచారణకు హాజరై సంచలన ఆరోపణలు చేశారు. “పార్టీలో ఎదగాలంటే… శీలంపై సర్దుకుపోవాల్సిందేనని పార్టీ నేతలు తన బిడ్డకు స్పష్టంగా చెప్పారని” యువతి తండ్రి ఎన్డీడబ్ల్యూ చైర్ పర్సన్ లలితా కుమార మంగళం ముందు స్టేట్ మెంట్ ఇవ్వడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
‘నీ శరీరంపై ప్రేమను వదులుకొని సర్దుకుపోవాలి. మేం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తేనే పార్టీలో ఎదుగుతావు’ అని ఆప్ నేత తన కుమార్తెను లైంగికంగా వేధించాడని, ప్రస్తుతం తన ఇద్దరు మనవరాళ్లను స్కూలుకు కూడా రానివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. నేతల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వివరించారు. కాగా, ఈ కేసులో ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు దిలీప్ పాండే సహా పలువురిపై ఆరోపణలను పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఓ ఆప్ నేతను అరెస్ట్ చేయగా, ఇప్పటికే బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే, సదరు మహిళా కార్యకర్త తల్లిదండ్రుల ఆరోపణలను ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్ పేయి ఖండించారు. ‘ఆరోపణలు వచ్చిన వ్యక్తికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, అతను ప్రాథమిక సభ్యుడు కాదని, కేసుతో పార్టీకి ప్రమేయం లేదని, ప్రస్తుతం విచారణ దశలో ఉంది, నిజం ఏంటో తేలుతుందని’ అన్నారు. మృతురాలి పిల్లలను స్కూలుకు రానివ్వని విషయం తెలుసుకున్న మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ స్వయంగా కల్పించుకుని పాఠశాల యాజమాన్యానికి క్లాస్ పీకారు.