AAP Somnath Bharti Comments Pawan Kalyan, AAP Somnath Bharti Comments Janasena,ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా అధికారం మాత్రం తమదే అని గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఉండడమే తమకు బాగా కలిసొచ్చే అంశమని, మళ్ళీ అధికారం మాదే అని టిడిపి వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన ‘జనసేన’ ఏపీలో జెండా పాతుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

అయితే తాజాగా తిరుపతిలో సమావేశం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం 2019లో ఏపీ అధికారం తమదే అంటున్నారు. కనీసం ఈ స్థాయి వ్యాఖ్యలు చేయాలంటే ఏపీలో రాజకీయ అవగాహన ఎంతో ముఖ్యం. మరి ఆమ్ ఆద్మీ సౌతిండియా ఇంచార్జ్ అయిన సోమ్ నాథ్ భారతి ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉందో తెలిస్తే… ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. ‘ప్రత్యేక హోదా’ కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చిన సదరు నేత చేసిన ప్రకటన మీడియా వర్గాలనే ఖంగు తినిపించింది.

ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ అయిన ‘జనసేన’ ఒకటుందన్న విషయం అసలు తమకు తెలియదని అవాక్కయ్యేలా చెప్పారు. 2019లో పవన్ పార్టీ ‘జనసేన’తో పొత్తు ఉంటుందా? అన్న ఓ విలేఖరి ప్రశ్నకు జవాబుగా ‘అసలు అలాంటి పార్టీ ఒకటి ఉందని తమకు తెలియదని’ జవాబు చెప్పడంతో… సదరు విలేఖరి ‘మీరేం సౌతిండియా ఇంచార్జ్ సార్’ అనడంతో చిన్నబోవడం సోమ్ నాథ్ వంతయ్యింది. అలా 2019లో ఏపీలో అధికారంలోకి రాబోయే పార్టీ సౌతిండియా ఇంచార్జ్ కు అనుకోని పరాభవం ఎదురయ్యింది.