aadi pona aavan movie actress shruti patel cheats NRIసాధారణంగా ‘పెళ్లి పేరిట ఓ యువతిని మోసగించిన యువకుడి అరెస్టు’ అనే వార్తలు చూస్తుంటాం. కానీ, పెళ్లి పేరిట ఓ ఎన్నారైను మోసం చేసిన యువతి కథ ఇది. ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెన్నయ్ కు చెందిన తమిళ వర్థమాన సినీ నటి శ్రుతి మోసానికి పాల్పడింది. అతని వద్ద నుంచి 41 లక్షలు గుంజుకుంది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడుతో పాటు శ్రుతికి తండ్రిగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సేలంకు చెందిన వ్యక్తి జి.బాలమరుగన్, జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను అవివాహితుడు. 2017 మేలో అతను తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ఉంచాడు. ఇదే వెబ్ సైట్ ద్వారా శ్రుతి అతనికి పరిచయమైంది. తన పేరును మైథిలీ వెంకటేశ్ గా అతనికి పరిచయం చేసుకున్న శ్రుతి, అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల ఫొటోలను అతనికి పంపింది.

ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, తన ఆరోగ్యం బాగాలేదని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తనకు శస్త్ర చికిత్స చేయాలని, తన తల్లి ఆరోగ్యం కూడా బాగుండలేదని, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని బాలమురుగన్ ని నమ్మించింది. ఈ మాటలు నిజమని నమ్మిన బాలమురుగన్ పలు వాయిదాల్లో మొత్తం 41 లక్షల వరకు ఆమెకు పంపించాడు. 2017 మే నుంచి ఈ ఏడాది జనవరి 1 లోపు ఈ మొత్తం ఆమెకు పంపించాడు.

అయితే శ్రుతి ఫొటోలను, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలను బాలమురుగన్ తన బంధువులకు, స్నేహితులకు చూపించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు బాలమురుగన్ ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. “ఆడి పోనాల్” చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో, నిరాశ చెంది ఇలా మారిందని, మొత్తమ్మీద ఓ ఒక కోటి యాభై లక్షల దాకా ధనవంతులైన యువకులను లోబరుచుకుందనేది పోలీసుల సమాచారం.