పెద్ద నోట్ల రద్దుతో క్యాష్ లెస్ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మున్ముందు కార్డ్ లెస్ లావాదేవీలకు రంగం సిద్ధం చేస్తోంది. క్రెడిట్, డెబిట్ వంటి కార్డులతో పని లేకుండా ఒక్క ఆధార్ నంబరుతోనే మొత్తం లావాదేవీలు నిర్వహించేలా ఓ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తోంది. అదే కనుక అందుబాటులోకి వస్తే నగదు రహితమే కాదు.. కార్డ్ లెస్ దేశంగా భారత్ ఉద్భవిస్తుంది.
లావాదేవీల కోసం ఆధార్ నంబరు చెప్పి వేలిముద్రను ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా మన ఖాతాలోని సొమ్మును వేరొకరి ఖాతాలోకి బదలాయించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ను రూపొందిస్తోంది. ఇక నుంచి దేశంలో ఉత్పత్తి అయ్యే ఫోన్లు అన్నింటిలో ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానర్లు తప్పకుండా ఉండేలా చూడాలని మొబైల్ తయారీదారులను కోరినట్టు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు.
ఇది కార్యరూపం దాలిస్తే… మన కవులు రాసిన ‘ఆడదే ఆధారం…’ అన్న పాటను సవరిస్తూ ‘ఆధార్ కార్డే ఆధారం…’ మరో గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాస్ పోర్ట్ వంటి ముఖ్యమైన విభాగాలలో సైతం ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపధ్యంలో… భవిష్యత్తులో “ఆధార్ ఇండియా”గా అవతరించనుందన్న సంకేతాలు కనపడుతున్నాయి. అయితే ఇదే ‘ఆధార్’ను ప్రతిపక్షంలో ఉన్నపుడు, ఇదే బిజెపి తీవ్రంగా విమర్శించి, కాంగ్రెస్ దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే.