How many will remain with Jagan?ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. ఈ ‘ఆకర్ష్’కు ఎలా చెక్ పెట్టాలో తెలియక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్న వైనం తెలిసిందే. జాతీయ నాయకుల వద్దనైనా టీడీపీ ‘ఆకర్ష్’పై ఆందోళన వెలిబుచ్చుదామంటూ చేపట్టిన ఢిల్లీ యాత్ర సత్ఫలితాలిస్తుందో? లేదో? తెలియదు కానీ, ఆరంభంలోనే జగన్ కు గట్టిషాక్ ఇచ్చింది.

జగన్ పిలుపు మేరకు సోమవారం నాడు ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలలో 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో 8 మంది ఎమ్మెల్యేల అడ్రెస్ గల్లంతైంది. మాయం అయిన వారి జాబితాను పరిశీలిస్తే… కిడారి సర్వేశ్వరరావు (అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), రామచంద్రారెడ్డి (పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.

ఇందులో అమర్ నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదని తెలుస్తోంది. తన తాత మరణంతో ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి… సోమవారం రాత్రి సమయంలో మళ్ళీ ఢిల్లీ పయనమయ్యారు. ఇక కిడారి, గొట్టిపాటి, బుడ్డా, పోతుల… కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మొదటి ముగ్గురు టీడీపీలోకి ‘జంప్’ చేసేందుకు దాదాపుగా కార్యరంగాన్ని సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగుతుండగా, అరకు ఎమ్మెల్యే దీనిపై ఇప్పటికే ఓ ప్రకటన చేసి జగన్ కు షాక్ ఇచ్చారు. అయితే మిగతా వారు కూడా టిడిపిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న కారణంగానే ఢిల్లీ బృందంలో కనిపించలేదని టాక్.

దీంతో ఢిల్లీ జంపింగ్ జాబితా గురించి అటు వైసీపీ వర్గాల్లోనే కాక ఇటు టీడీపీ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే, పోతుల రామారావు కనిపించకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈయన కూడా జంపింగ్ జాబితాలో ఉన్నారా? ఈ క్రమంలోనే ఢిల్లీకి రాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద జగన్ ఏం ముట్టుకున్నా… చివరికి అది ‘బూమ్ రంగ్’ అవుతుండడం గమనించదగ్గ విషయం.